నిజంగా ఒక్కోసారి కొందరు కావాలనే చేస్తారో లేదంటే.. పబ్లిసిటీ కోసం చేస్తారో తెలియదు కానీ అమ్మాయిల పట్ల నీచంగా ప్రవర్తిస్తుంటారు. చెప్పుకోవడానికే సిగ్గు పడే విధంగా ఉండే నీచమైన ఘటనలకు పాల్పడుతారు. ఇప్పుడు మేం చెప్పబోతుంది కూడా సరిగ్గా ఇలాంటి ఓ ఘటన గురించే. శానిటరీ నాప్కిన్ను నిర్లక్ష్యంగా పారేసిన విద్యార్థినిని గుర్తించేందుకు ఆ హాస్టల్లోని అందరు అమ్మాయిల బట్టలిప్పి తనిఖీ చేయాలంటూ మహిళా వార్డెన్ ఆదేశించగా విద్యార్థినిలు దీన్ని పెద్ద ఎత్తున ఖండిస్తూ నిరసన తెలిపారు. దీంతో ఈ విషయం కాస్తా ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…
మధ్యప్రదేశ్ రాష్ట్రం సాగర్లోని డాక్టర్ హరిసింగ్ గౌర్ కేంద్రీయ విశ్వవిద్యాలయం క్యాంపస్ లో విద్యార్థినుల హాస్టల్ టాయ్లెట్లో మార్చి 25వ తేదీన రాత్రి ఓ శానిటరీ నాప్కిన్ పడి ఉండడాన్ని ఆ హాస్టల్ లేడీ వార్డెన్ ప్రొఫెసర్ చంద్ర బెన్ గమనించింది. దీంతో ఆమె విద్యార్థినుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాప్కిన్ను ఎవరు పడేశారో చెప్పాలంటూ ఆ హాస్టల్లో ఉన్న 40 మంది విద్యార్థినులను నిలదీసింది. దీంతో ఎవరూ సమాధానం చెప్పలేదు. అందరు విద్యార్థినులు ఆ వార్డెన్ తీరు పట్ల భయం చెందారు. ఈ క్రమంలో వారిలో ఎవరెవరు బహిష్టు అయ్యారో గుర్తించాలంటూ ఆ వార్డెన్ హాస్టల్లో ఉన్న మహిళా సిబ్బందిని ఆదేశించింది.
నాప్కిన్ ఎవరు పారేశారో తెలుసుకోడానికి విద్యార్థినుల బట్టలిప్పి తనిఖీ చేయాలని వార్డెన్ చెప్పింది. దీంతో ఆ హాస్టల్లోని మహిళా సిబ్బంది అదే పని చేసేందుకు ఉపక్రమించారు. దీనికి ఆ విద్యార్థినులు ఒప్పుకోలేదు. వారు ఆందోళనకు దిగారు. క్యాంపస్లోని వీసీ ఇంటి ప్రాంగణానికి చేరుకుని విద్యార్థినులు పెద్దపెట్టున నినాదాలిచ్చారు. వెంటనే స్పందించిన వీసీ ఆర్పీ తివారీ వార్డెన్ చర్యపై విద్యార్థినులకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. వారంతా నా కూతుళ్ల లాంటి వారే. వారికి క్షమాపణలు చెప్పాను. ఇది హేయమైన చర్య. బాధాకరమైన విషయం. ఈ ఘటనపై ఒక త్రిసభ్య కమిటీని నియమించాను. మూడు రోజుల్లో నివేదిక వస్తుంది. ఆ వెంటనే చర్యలు తీసుకుంటా.. అంటూ ఆయన మీడియాకు తెలిపారు.
ఇక మార్చి 26వ తేదీన సోమవారం ఏబీవీపీ, ఎన్ఎస్ యూఐ, ఇతర విద్యార్థి సంఘాలు ఈ ఘటనపై ఆందోళన చేపట్టాయి. సదరు వార్డెన్ను సస్పెండ్ చేయాలని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి. అధ్యాపకుల్లో తమ పరిస్థితులపై అవగాహన కల్పించేందుకు ఎన్ఎస్ యూఐ విద్యార్థినులు వారికి శానిటరీ నాప్కిన్లను పంచిపెట్టారు. సాగర్ ఎంపీ లక్ష్మీనారాయణ్ యాదవ్ మాత్రం ఇది చాలా చిన్న విషయమని వ్యాఖ్యానించారు. అయితే.. వార్డెన్ మాత్రం అలా ఆదేశించడం సిగ్గు చేటని అన్నారు. దీన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. ఏది ఏమైనా ఇలాంటి నీచమైన ఘటనలకు పాల్పడే వారికి మాత్రం కొంచెం గట్టిగానే బుద్ధి చెప్పాలి కదా. ఏమంటారు..!