నేటి తరుణంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో అందరికీ తెలిసిందే. టెక్నాలజీని వాడలేకుండా మనం ఉండలేకపోతున్నాం. ముఖ్యంగా స్మార్ట్ఫోన్లలో అయితే టెక్నాలజీని చాలా మంది వాడుకుంటున్నారు. అందులో చెప్పుకోదగినది మ్యాప్స్. ఒకప్పుడు ఏదైనా కొత్త ప్లేస్కు వెళితే రోడ్డుపై కనబడిన వారిని అందరినీ అడ్రస్ అడుగుతూ వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడలా కాదు. చేతిలోకి స్మార్ట్ఫోన్ వచ్చేసింది. అందులో ఎంచక్కా మ్యాప్స్ ఓపెన్ చేస్తే చాలు, మనం కొత్త ప్రదేశానికి వెళ్లినా అడ్రస్ను సులభంగా కనుక్కునే వెసులుబాటు కలిగింది. అయితే నిజానికి ఈ మ్యాప్స్ టెక్నాలజీ వల్ల మనకు లాభం బాగానే ఉన్నా దీన్ని అన్ని సమయాల్లోనూ నమ్మడానికి లేదు. అది కూడా ఒక్కోసారి మనల్ని మోసం చేస్తుంది. కావాలంటే.. ఆ వ్యక్తులకు మ్యాప్స్ను వాడే విషయంలో ఏం జరిగిందో మీరే చదివి తెలుసుకోండి.
ఈ నెల 12వ తేదీన అమెరికాలోని వెర్మాంట్ అనే ప్రదేశంలో ఉన్న చంప్లెయిన్ అనే సరస్సులోకి ఓ కారు దూసుకెళ్లింది. అందులో ఇద్దరు ప్రయాణిస్తున్నారు. అయితే వారు కావాలని సరస్సులోకి వెళ్లలేదు. వారిని అలా ముందుకు వెళ్లమని సూచించింది ఆ కారులో ఉన్న జీపీఎస్సే. దాని వల్లే వారు ముందున్నది సరస్సు అని చూడకుండా కారును పోనిచ్చారు. కారులో వారు జీపీఎస్ ప్రకారం దారి వెతుక్కుంటూ వెళ్తుండగా, జీపీఎస్ తప్పుగా పనిచేసింది. ముందు ఉన్నది సరస్సు అని దానికి తెలియదు కదా, అందుకే అది కారులో ఉన్నవారికి నేరుగా ముందుకు వెళ్లమని సూచన ఇచ్చింది. దీంతో వారు కారును ముందుకు పోనిచ్చారు. ఈ క్రమంలో ఆ కారు సరస్సులో మునిగిపోయింది.
అయితే ఆ సరస్సు మంచు వల్ల మొత్తం గడ్డకట్టుకుపోయింది. ఒక్కసారిగా దానిపై కారు ప్రయాణించే సరికి ఆ మంచు అంతా పగిలిపోయింది. దీంతో కారు సరస్సులోకి మునిగిపోయింది. అయితే అదృష్టవశాత్తూ అందులో ప్రయాణిస్తున్న ఇద్దరికీ ఏమీ కాలేదు. వారు సేఫ్ గా బయటకు వచ్చారు. తరువాత కొద్ది రోజులకు కారును బయటకు తీశారు. ఏది ఏమైనా ఆధునిక టెక్నాలజీని అంత గుడ్డిగా మాత్రం నమ్మకూడదు కదా. అలా అని ఈ సంఘటనే మనకు చెబుతుంది..!