కళాశాలలో చదివే రోజుల్లో ఇద్దరూ ప్రేమించుకున్నారు. ప్రతిరోజు చాటింగ్లు, మీటింగులు. పెళ్లి చేసుకుందామనుకున్నారు. కులాలు వేరవడంతో యువతి తల్లి వారి ప్రేమను అంగీకరించలేదు. తల్లిదండ్రుల మాట కాదనలేక విషయం ప్రేమించిన వ్యక్తికి చెప్పి అప్పటి నుంచి అతడికి దూరంగా ఉంటోంది. ఇంతలో తనకు విదేశాల్లో ఉద్యోగం రావడంతో వెళ్లిపోయింది. అప్పటి నుంచి ప్రియురాలిపై కక్ష పెంచుకున్న అతడు ఆమె పరువు తీయాలని, సమాజంలో తలెత్తుకోకుండా చేయాలని పథకం వేశాడు. ఇద్దరూ ప్రేమించుకున్నప్పుడు సేకరించిన ఫొటోలు, వీడియోలను తన ఫోన్లో భద్రపరచుకున్నాడు. వాటిని అశ్లీల ఫొటోలుగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ప్రియురాలితోపాటు ఆమె స్నేహితులకు షేర్ చేశాడు. సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలను డౌన్లోడ్ చేసుకున్న మరో యువకుడు వాటిని అశ్లీల వెబ్సైట్లో అప్లోడ్ చేశాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులను అరెస్టు చేశారు.
డీసీపీ(క్రై) జానకి షర్మిల తెలిపిన వివరాల ప్రకారం… ప్రకాశం జిల్లా సింగరాయకొండ సోమరాజుపల్లి గ్రామానికి చెందిన గుంజి అంకంరాజు రంగారెడ్డిజిల్లా కొండాపూర్లోని ఇజ్జత్నగర్ వీకర్స్ కాలనీలో నివసిస్తూ శ్రీ ఆదిత్య హోటల్ అండ్ రిసార్ట్స్లో ఉద్యోగం చేస్తున్నాడు. నిజాంపేటలో ఓ కళాశాలలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేశాడు. అదే కళాశాలలో తనతోపాటు హోటల్ మేనేజ్మెంట్ చదువుతన్న యువతిని ప్రేమించాడు. ఆమె కూడా అతడి ప్రేమను అంగీకరించడంతో పర్సనల్ ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకునేవారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం యువతి తన తల్లికి చెప్పింది. ఇద్దరి కులాలు వేరవడంతో ఆమె వారి ప్రేమను అంగీకరించలేదు.
యువతి విషయం అతడికి చెప్పి దూరంగా ఉంటోంది. దుబాయ్లో ఉద్యోగం రావడంతో వెళ్లిపోయింది. తన ప్రేమను కాదని ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్లిన ప్రియురాలిపై కక్ష పెంచుకున్నాడు. ఆమె పరువు తీయాలని ఫొటోలు, వీడియోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్లో అప్లోడ్ చేశాడు. వాటిని ఆ యువతి ఫ్రెండ్స్కు, తన స్నేహితులకు పంపించాడు. ఆమెను లైంగికంగా వేధించడం, బ్లాక్మెయిల్, బెదిరించేవాడు.
రాజు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన అశ్లీల ఫొటోలను వారాసిగూడ ప్రాంతానికి చెందిన నిట్టల రాజీవ్ సుశ్రుత్(19) డౌన్లోడ్ చేశాడు. వాటిపి పోర్న్ వెబ్సైట్లో అప్లోడ్ చేశాడు. యువతి విషయాన్ని తల్లికి చెప్పగా సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. నిందితులను శుక్రవారం అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. వారి నుంచి రెండు సెల్ఫోన్లు, రూటర్ స్వాధీనం చేసుకున్నారు.