రిలయన్స్ జియో 4జీ ఫీచర్ ఫోన్. గత కొద్ది రోజుల క్రితమే విడుదలైంది. కొన్ని లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. ధర రూ.1500. 3 ఏళ్ల తరువాత ఆ మొత్తాన్ని తిరిగిచ్చేస్తారు. ఇక తాజాగా ఎయిర్టెల్ 4జీ ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చింది. ధర రూ.1399. 3 ఏళ్లకు మళ్లీ ఆ మొత్తం ఇస్తారు. ఈ క్రమంలోనే ఈ రెండింటికీ పొటీగా మైక్రోమ్యాక్స్ ఓ నూతన 4జీ ఫీచర్ ఫోన్ను తాజాగా విడుదల చేసిది. భారత్ 1 పేరిట ఆ ఫోన్ విడుదలైంది. మరి దీని విశేషాలు ఏమిటో చూద్దామా..!
దేశీయ మొబైల్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ భారత్ 1 పేరిట ఓ నూతన 4జీ ఫీచర్ ఫోన్ను తాజాగా విడుదల చేసింది. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్తో భాగస్వామ్యమైన మైక్రోమ్యాక్స్ ఈ ఫోన్ను విడుదల చేసింది. రూ.2,200 ధరకు ఈ ఫోన్ యూజర్లకు లభిస్తోంది. దీంతో పాటు బీఎస్ఎన్ఎల్ రూ.97 ప్లాన్ను అందిస్తోంది. ఇందులో వినియోగదారులకు అన్లిమిటెడ్ కాల్స్, అన్లిమిటెడ్ హై స్పీడ్ డేటా సదుపాయాలు లభిస్తున్నాయి.
మైక్రోమ్యాక్స్ విడుదల చేసిన భారత్ 1 4జీ ఫీచర్ ఫోన్లో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ను ఏర్పాటు చేశారు. దీని వల్ల ఫోన్ 4జీ వీవోఎల్టీఈని సపోర్ట్ చేస్తుంది. ఇందులో జియో సిమ్ వేసుకోవచ్చు. 22 భారతీయ భాషలకు ఇందులో సపోర్ట్ లభిస్తున్నది. 2000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఇందులో ఏర్పాటు చేశారు. దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా వస్తుంది. ఇక ఈ ఫోన్లో డ్యుయల్ సిమ్ ఫీచర్ ఇచ్చారు. వెనుక భాగంలో 2 మెగాపిక్సల్ కెమెరా, ముందు భాగంలో వీజీఏ కెమెరా ఇచ్చారు. ఈ ఫోన్లో 100 లైవ్ టీవీ చానల్స్ను వీక్షించవచ్చు. పాటలను వినవచ్చు. వీడియోలను చూడవచ్చు. భీమ్ యూపీఐ పేమెంట్స్ యాప్, బీఎస్ఎన్ఎల్ వాలెట్ యాప్స్ను ఇందులో ప్రీలోడెడ్గా అందిస్తున్నారు.