దేశ ప్రజలందరికీ అన్నం పెడుతున్న రైతన్న అంటే నిజంగా ఎవరికీ లెక్కలేదు. రైతుగా కాకపోయినా వారిని కనీసం మనుషులుగా కూడా చూడడం లేదు. అలా నిర్లక్ష్యంగా చూడడం వల్లే ఓ ఇద్దరు రైతులకు ప్రాణాపాయ స్థితి వచ్చింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హృదయ విదారకమైన ఈ సంఘటన జరిగింది అనంతపురం జిల్లాలో. అక్కడి మడకశిర నియోజకవర్గంలో ఉండే మెళవాయి గ్రామానికి చెందిన నబీరసూల్కు పంట చేను వేసే కొంత భూమి ఉంది. అయితే ఈ మధ్యే కర్ణాటకలోని తుముకూరు జిల్లా పావగడ-మధుగిరి మధ్య 220KV సబ్ స్టేషన్ కు హైటెన్షన్ వైర్లు లాగే పనులు ప్రారంభించారు.
ఈ క్రమంలో సదరు హైటెన్షన్ వైర్లు నబీరసూల్ చేను పైనుంచి వెళ్తున్నాయి. దీంతో అతనికి నష్ట పరిహారం కింద కొంత మొత్తం చెల్లించారు. అయితే అది తనకు సరిపోలేదని, ఇంకా ఎక్కువ నష్ట పరిహారం కావాలని డిమాండ్ చేస్తూ నబీరసూల్ తన కొడుకు వన్నూర్ సాబ్తో కలిసి తన భూమిలో జరుగుతున్న హైటెన్షన్ వైర్లు లాగే పనిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారు ఆ వైర్లను పట్టుకుని నిలుచున్నారు. తమకు ఎక్కువ నష్ట పరిహారం కావల్సిందేనని పట్టుబట్టారు. అయితే వారి మాటలను లెక్క చేయకుండా ఆ పనులను చేపట్టిన కాంట్రాక్టర్ ఒక్కసారిగా జేసీబీతో ఆ వైర్లను పైకి లాగించాడు.
దీంతో హైటెన్షన్ వైర్లను పట్టుకుని ఉన్న నబీరసూల్, వన్నూర్ సాబ్ లు ఒక్కసారిగా వైర్లతోపాటే గాల్లోకి లేచారు. అలా వైర్లు 5 మీటర్ల ఎత్తుకు లేవగానే నబీ రసూల్ దూకేయగా, వన్నూర్ సాబ్ మాత్రం వైర్లు ఇంకా పైకి లేవడంతో 10 మీటర్ల ఎత్తు నుంచి కిందకు దూకాడు. దీంతో అతని వెన్నెముక విరిగి తీవ్ర గాయాలకు గురయ్యాడు. నబీ రసూల్కు కూడా తీవ్రంగానే గాయలయ్యాయి. దీంతో ఇద్దరినీ స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కాగా నష్ట పరిహారం డిమాండ్ చేస్తున్న ఆ రైతులను ఏ మాత్రం పట్టించుకోకుండా అత్యంత నిర్లక్ష్యంగా వైర్లను పైకి లాగించినందుకు గాను సదరు కాంట్రాక్టర్ ను అందరూ విమర్శిస్తున్నారు. నెట్లో ఇప్పుడీ వీడియో ట్రెండింగ్ గా మారింది. రైతులన్న కనీస సోయి, జ్ఞానం లేకుండా అత్యంత అమానవీయంగా ప్రవర్తించినందుకు గాను ఆ కాంట్రాక్టర్ చర్యను అందరూ తప్పు పడుతున్నారు. ఏది ఏమైనా… అసలే నష్టాలతో అప్పుల ఊబిలో కూరుకుపోయే అన్నదాతలకు మాత్రం కనీసం ఇలాంటి విషయాల్లోనైనా ప్రభుత్వాలు, నేతలు న్యాయం చేయాల్సిందే..!