అర్థరాత్రి పూట.. అకస్మాత్తుగా.. టెర్రరిస్టులు దాడి చేశారు.. ఆర్మీ నివాసాలే లక్ష్యంగా కాల్పులు జరుపుతూ ముందుకు సాగారు. అప్పటికే నివాసాల్లో ఉన్న పలువురిని ఆర్మీ వారు రక్షించారు. కానీ కొందరు ఇంకా మిగిలారు. అంతలో ఓ ఆర్మీ అధికారి భార్యకు వెన్నులో టెర్రరిస్టుల బుల్లెట్ తాకింది. దాంతో ఆమె కుప్పకూలింది. ఆమె నిండు గర్భిణీ. ఏ క్షణంలో అయినా బిడ్డకు జన్మనివ్వవచ్చు. అలాంటి సమయంలో బుల్లెట్ తాకడంతో నేలకొరిగింది. అందరూ ఆమె చనిపోయిందనే భావించారు. అయినా ఏదో చిన్న ఆశ. ఆమెను హాస్పిటల్కు తరలించారు. చివరకు దేవుడి దయో, ఆమె చేసుకున్న పుణ్యమో తెలియదు. ఆమె బతికింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇది కథ కాదు. తాజాగా జరిగిన ఓ యదార్థ సంఘటన.
అది జమ్మూ కాశ్మీర్లోని సుంజువాన్ క్యాంప్. భారత ఆర్మీ అధికారులు తమ తమ కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉండే క్వార్టర్స్. ఈ నెల 11వ తేదీన అర్ధరాత్రి సమయంలో నలుగురు టెర్రరిస్టులు ఆ క్వార్టర్స్పై దాడికి పాల్పడ్డారు. అంతకు కొంత దూరం నుంచే టెర్రరిస్టుల దాడిని భారత సైనికులు కనిపెట్టారు. దీంతో నివాసాల్లో ఉన్న ఆర్మీ కుటుంబాలను సేఫ్ ప్లేస్ కు తరలించారు. అయితే అప్పటికే టెర్రరిస్టులు బాగా ముందుకు వచ్చేశారు. ఈ క్రమంలో వారు ఎడ తెరిపి లేకుండా కాల్పులు జరిపారు. వారి బుల్లెట్ల ధాటికి ఒక ఆర్మీ ఆఫీసర్ కూతురు తలకు గాయాలయ్యాయి. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మరో బాలుడి తలకు కూడా గాయలవ్వగా అతన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఇక అదే దాడిలో 24 సంవత్సరాల వయస్సున్న షాహ్జాదా ఖాన్ అనే గర్భిణీకి వెన్నులో బుల్లెట్ తాకింది. దీంతో ఆమె చనిపోయిందని అనుకున్నారు.
అలా షాహ్జాదాకు బుల్లెట్ తగలడంతో ఆమె కుప్పకూలింది. దీంతో సైనికులు ఆమెను హాస్పిటల్కు తరలించారు. అయితే అప్పటికే ఆమె నిండు గర్భిణి. దీంతో డాక్టర్లు ఎలాగో కష్టపడి ఆమెకు సర్జరీ చేశారు. ఆమె ప్రాణాలతో బయట పడడమే కాదు, పండంటి బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఇక టెర్రిరిస్టుల దాడిలో భారత సైనికులు 5 మంది చనిపోయారు. వారిలో ఒక సైనికుడు తన చేతుల్లో ఎలాంటి ఆయుధం లేకున్నా ఓ టెర్రరిస్టుతో పోరాడి అతన్ని చంపి వీరమరణం పొందాడు. అతని పేరు సుబేదార్ మదన్ లాల్ చౌదర్. వీరమరణం పొందిన ఇతనితోపాటు మిగిలిన సైనికులకు మనం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. మనల్ని కాపాడే సైనికులకు, వారి కుటుంబాలకు ఇదే మన శాల్యూట్..!